Sunday, December 14, 2008

ఇందుకు అభినందనలా?


వరంగల్ లో ఇంజినీరింగ్ చేస్తున్న ఇద్దరు విద్యార్థినుల మీద ముగ్గురు ఓ బైక్ లో వచ్చి ఆసిడ్ పోయడంతో వాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనతో మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇలా చాలా సంఘాలు ఆందోళనలు మొదలు పెట్టాయి. ముందే ఆ అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతుర్ని వేధిస్తున్నారు అని కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోని పోలీసులు, ఈ సంఘటన జరిగిన 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారంటే కాస్త అభినందించాల్సిందే. కాని మరో 6 గంటల్లోనే కాల్చేసి 'ఎన్ కౌంటర్' అనడమే ధారుణం. పోలీసులు చెప్తున్న కారణాలు ,జరిగిన తీరు వింటే చిన్న పిల్లాడైనా చెప్పగలడు ఇది కట్టు కధ అని. అంతకంటే బాధాకరం ఏంటంటే ప్రజలు, మహిళా సంఘాలు పోలీసులని అభినందిస్తున్నారట. ఆ ముగ్గురు చేసింది హేయమైన చర్యే కాని పోలీసులు తమ కష్టడీ లో వున్నవాళ్ళని చంపడం సమర్ధనీయం కాదు. ఇప్పుడు వాళ్లు చేసిన తప్పుకు సరైన శిక్ష అనిపించవచ్చు కాని మనది ఆటవిక న్యాయం కాదు కదా, వాళ్లు ఆసిడ్ పోసారు మేము చంపేసాము అనడానికి. పోలీసు వ్యవస్థ పని నేరస్తులను పట్టుకోవడం వరకే ,శిక్షించడం కాదు. రెండూ వాళ్ళే చేస్తే వారిని నియంత్రించేది ఎవరు? రాత్రి 12 గంటల సమయం లో వాళ్లు వాడిన బైక్ కోసం జన సంచరాం లేని ప్రదేశానికి తీసుకొని వెళ్ళాం, వాళ్లు మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు అందుకే చంపేసాము అనడం పచ్చి అబద్దం. ఇది దిగజారిన మన వ్యవస్థని మరింత దిగాజార్చడమే. మనుషులని చంపి తందూరీ లో పెట్టినవాళ్ళు, తాగిన మైకం లో కారు మనుషులపైన నడిపి చంపిన వాళ్ళని మనం ఏమీ చేయం కాని , ఇలాంటి వారికి మాత్రం తగిన న్యాయం జరిగిందని ఆనందిస్తాం . ఈ ముగ్గురు కూడా రాజకీనాయకుల కోడకులో, బాగా డబ్బున్నవాల్లో అయ్యుంటే ఇలా జరిగి వుండేదా.

1 comment:

Unknown said...

encounter అర్ధమే మారి పోయింది. ఉన్నత విద్యావంతులైన ఎస్ పి... డి జి పి ....స్థాయి అధికారులు మొదలుకొని Home Minister వరకు అందరూ అబద్దాలు చెప్పాల్సిన దౌర్భాగ్యం ఏమిటో ... ఈ ఆత్మవంచన ఎందుకో... అబద్దాల పునాది మీద ఆధారపడే వ్యవస్థ ఎవరిని ఉద్దరిస్తుందో ఏమి అర్ధం కావడం లేదు. గాంధీని చంపిన గాడ్సేని కూడా రెండు రోజుల్లో సఫా చేయలేదు. ముంబాయి పై దాడి చేసి ప్రాణాలతో పట్టు బడ్డ టెర్రరిస్ట్ కసాబ్ ను కూడా ఇంకా ప్రాణాలతో వుంచారు. మరి ఈ సాడిస్ట్ నిందితుల విషయం లో అంత తొందర దేనికి ? మన కోర్టులు పనికిమాలినవని, మన చట్టాలు పదునులెనివని ప్రజలకి చాటి చెప్పడానికా? హరికృష్ణ కి అసలు కుట్ర తో సంబంధం లేదని, సంజయ్ పిలిస్తే వెళ్ళాడని తెలుస్తోంది. నిజానిజాలు తేలకుండానే అతడిని కూడా చంపేశారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు స్వప్నికతో పరిచయం వున్నది పగ వున్నది ఒక్క శ్రీనివాస్ కే కదా ! ముగ్గురికి సమానంగా మరణ శిక్ష ఎలా విధిస్తారు? ఆయేషా హంతకుల విషయంలో పోలీసుల సమాధానం ఏమిటి? అన్ని శేష ప్రశ్నలే ! వరంగల్ పోలీసులకు జేజేలు పలికిన విద్యార్ధులు వీటికి జవాబు చెప్పాలి.